‘లాహోర్‌లో వాజ్‌పేయికి సెల్యూట్ చేయని ముషారఫ్’-కార్గిల్ చొరబాట్లకు అప్పటికే ప్లాన్ చేయడం కారణమా?

పాకిస్తాన్, కార్గిల్, భారత్, వాజ్‌పేయి, నవాజ్ షరీఫ్, ఆపరేషన్ సఫేద్ సాగర్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అభిషేక్ ప్రతాప్ సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 10 నిమిషాలు

కార్గిల్‌పై 'ఎల్ఓసీ కార్గిల్' నుంచి 'షేర్షా' వరకు మనం ఎన్నో సినిమాలు చూశాం. అవన్నీ భూమిపై జరిగిన యుద్ధం కథలే.

కాలినడకన పర్వతాలు ఎక్కుతున్న సైనికులు, బంకర్లు, శిఖరాలపై రెపరెపలాడుతున్న త్రివర్ణ పతాకం.. ఇవన్నీ మనకు వీటిలో కనిపిస్తాయి.

ఇటీవల విడుదలైన నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’ ఈ యుద్ధాన్ని మొదటిసారిగా వైమానిక దళం (ఎయిర్ ఫోర్స్) కోణం నుంచి చిత్రీకరించింది.

ఈ సిరీస్ గురించి ఇప్పుడు చాలా చర్చ జరుగుతోంది. కానీ చరిత్ర పుటల నుంచి ఒక కథ తెరపైకి వచ్చినప్పుడు దానిలో అనేక ప్రశ్నలు కూడా వినిపిస్తాయి.

'ఆపరేషన్ సఫేద్ సాగర్' వెబ్ సిరీస్ 1999 ఫిబ్రవరి 21వ తేదీ నాటి ఘటనలతో అత్యంత నాటకీయమైన, చరిత్రాత్మక సన్నివేశానికి జీవం పోసింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పాకిస్తాన్, కార్గిల్, భారత్, వాజ్‌పేయి, నవాజ్ షరీఫ్, ఆపరేషన్ సఫేద్ సాగర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నవాజ్ షరీఫ్, పర్వేజ్ ముషారఫ్

ముషారఫ్‌ను వాజ్‌పేయికి నవాజ్ షరీఫ్ పరిచయం చేసినప్పుడు....

అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి లాహోర్ గవర్నర్ హౌస్‌లో ప్రసంగాన్ని తనదైన శైలిలో ఒక కవితతో ముగించారు. ఆ తర్వాత పాకిస్తాన్ సైనిక ఉన్నతాధికారులతో పరిచయ కార్యక్రమం సాగింది.

నాటి పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ముందుకు వచ్చి ప్రధానమంత్రి వాజ్‌పేయితో పాటు నడుస్తూ ఆయనకు సైనిక అధికారులను పరిచయం చేయడం ప్రారంభించారు. వాజ్‌పేయికి ముందుగా పరిచయం చేసిన వారిలో మొదటి వ్యక్తి పాకిస్తాన్ నౌకాదళం అధిపతి అడ్మిరల్ ఫసిహ్ బుఖారీ.

ఆయన భారత ప్రధానికి లాంఛనంగా సెల్యూట్ చేశారు. ఆయన తర్వాత వెంటనే ఎయిర్ చీఫ్ మార్షల్ పర్వేజ్ మెహందీ ఖురేషీ కూడా వాజ్‌పేయికి సెల్యూట్ చేశారు.

తర్వాత పాకిస్తాన్ సైన్యాధిపతి జనరల్ పర్వేజ్ ముషారఫ్ వంతు వచ్చింది. వాజ్‌పేయి ఆయన వద్దకు రాగానే ముషారఫ్ ఒక్క క్షణం ఆగారు. కొన్ని క్షణాల పాటు నెలకొన్న తీవ్ర నిశ్శబ్దం తర్వాత మిగతా ఇద్దరు సైన్యాధిపతుల్లా ముషారఫ్ సెల్యూట్ చేయకుండా వాజ్‌పేయివైపు చేయి చాచారు.

వెబ్ సిరీస్‌లో ముషారఫ్ కరచాలనంతో పాటు తెరపై నవాజ్ షరీఫ్ ముఖంలో కనిపించిన ఇబ్బందిని, వాజ్‌పేయి ముఖంలో వచ్చిన గంభీరమైన హావభావాల మార్పును ప్రేక్షకులు స్పష్టంగా అనుభూతి చెందుతారు.

పాకిస్తాన్, కార్గిల్, భారత్, వాజ్‌పేయి, నవాజ్ షరీఫ్, ఆపరేషన్ సఫేద్ సాగర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లాహోర్ వెళ్లిన బృందంలో కుల్‌దీప్ నయ్యర్ సభ్యులు.

కుల్‌దీప్ నయ్యర్ ఏం చెప్పారు?

''1999 ఫిబ్రవరిలో వాజ్‌పేయి లాహోర్‌కు వెళుతున్నప్పుడు వాఘా సరిహద్దు దగ్గర ఆయనకు పూర్తి అధికారిక స్వాగతం లభించింది. 21-గన్ సెల్యూట్, గౌరవ వందనం, గార్డ్ ఆఫ్ ఆనర్, ఇరు దేశాల జాతీయ గీతాలు ఆలపించడం వంటివి జరిగాయి. కానీ పాకిస్తానీ సైన్యాధిపతుల్లో ఎవరూ ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు'' అని ‘ది ప్రింట్’ 2019 రిపోర్ట్‌లో తెలిపింది.

సీనియర్ జర్నలిస్ట్ కుల్‌దీప్ నయ్యర్ లాహోర్‌కు వెళ్లిన 22 మంది భారత ప్రతినిధి బృందంలో సభ్యుడు.

పాకిస్తాన్ సైన్యం వ్యతిరేకంగా ఉండడంతో సయోధ్య కుదరలేదని, ముగ్గురు పాకిస్తాన్ సైన్యాధిపతులు భారత ప్రధానికి వందనం చేయడానికి నిరాకరించినప్పుడు ఈ విషయం స్పష్టమైందని ఆయన గల్ఫ్ న్యూస్‌లో రాసిన వ్యాసంలో తెలిపారు.

పాకిస్తాన్ సీనియర్ జర్నలిస్ట్ హమీద్ మీర్‌తో బీబీసీ ఫోన్‌లో మాట్లాడింది. పాకిస్తాన్ సైన్యాధిపతి జనరల్ పర్వేజ్ ముషారఫ్ భారత ప్రధానితో కరచాలనం చేశారా లేదా వందనం చేశారా అని మేము ఆయనను అడిగాం.

"ఆ సమయంలో పాకిస్తాన్ వైమానిక దళాధిపతి, నౌకాదళాధిపతి యూనిఫాంలు, టోపీలు ధరించి ఉన్నందున వారు వాజ్‌పేయికి వందనం చేశారు. అయితే జనరల్ పర్వేజ్ ముషారఫ్ యూనిఫాం ధరించి ఉన్నారు కానీ క్యాప్ పెట్టుకోలేదు. ఆయన సెల్యూట్ చేయడానికి బదులుగా కరచాలనం చేశారు" అని హమీద్ మీర్ చెప్పారు.

కుల్‌దీప్ నయ్యర్ వ్యాసాన్ని ప్రస్తావించగా హమీద్ మీర్ ఢాకాలో జరిగిన ఘటనను గుర్తుచేశారు.

"నేను ఢాకాలో నయ్యర్‌తో కలిసి కూర్చున్నప్పుడు కూడా ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. అక్కడున్న ఒక జర్నలిస్ట్ నా పక్కనే కూర్చున్న కుల్‌దీప్ నయ్యర్‌ను ఈ ప్రశ్న అడిగారు. నయ్యర్ స్వయంగా సమాధానం చెప్పకుండా 'హమీద్, దయచేసి ఆ సమయంలో ఏం జరిగిందో చెప్పండి' అని నన్ను అడిగారు" అని హమీద్ మీర్ అన్నారు.

పాకిస్తాన్, కార్గిల్, భారత్, వాజ్‌పేయి, నవాజ్ షరీఫ్, ఆపరేషన్ సఫేద్ సాగర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్ నేతలతో 1999లో అప్పటి భారత ప్రధాని వాజ్‌పేయి

వాజ్‌పేయికి ముషారఫ్ షేక్ హ్యాండ్ ఇవ్వడం గురించి 'ఆపరేషన్ సఫేద్ సాగర్' రచయిత ఏమన్నారు?

ఆపరేషన్ సఫేద్ సాగర్ రచయిత సందీప్ జైన్‌తో బీబీసీ మాట్లాడింది.

"మేం ప్రేక్షకులకు ముషారఫ్ వ్యక్తిత్వాన్ని చూపించాలనుకున్నాం. ఆ సమయంలో ముషారఫ్ మనసులో ఏం జరుగుతోందో ప్రేక్షకులకు అర్థం కావడానికి స్క్రీన్‌ప్లే మాత్రమే ఏకైక మార్గం" అని సందీప్ జైన్ అన్నారు.

"నిజానికి వాజ్‌పేయి లాహోర్‌కు రాకముందే ముషారఫ్ కార్గిల్ యుద్ధానికి పూర్తి ప్రణాళికను సిద్ధం చేశారు. ముషారఫ్ భారతదేశ ప్రధానమంత్రికంటే తానేమీ తక్కువ కాదన్న భావనను వ్యక్తం చేయడానికి ప్రయత్నించారని చెప్పడానికి ఆ సన్నివేశం ఒక సాధనంగా ఉపయోగపడింది. ముషారఫ్ షేక్‌హ్యాండ్ ఇస్తుండగా పాకిస్తానీ నౌకదళం, వైమానిక దళాల అధిపతులు వాజ్‌పేయికి సెల్యూట్ చేసిన సీన్ ఆ పాత్ర వ్యక్తిత్వాన్ని చూపించడానికి ఉపయోగపడింది" అని చెప్పారు.

ఆపరేషన్ సఫేద్ సాగర్ వెబ్ సిరీస్ విడుదలైన తర్వాత మరో చర్చ మొదలైంది.

2001లో ఆగ్రా శిఖరాగ్ర సమావేశంలో ముషారఫ్‌కు సెల్యూట్ చేయకపోవడం ద్వారా అప్పటి భారత వైమానిక దళ అధిపతి ఏవై టిప్నిస్ లాహోర్‌ ఘటనకు "ప్రతీకారం" తీర్చుకున్నారనే అభిప్రాయం వినిపిస్తోంది. వాస్తవానికి ఈ ఘటన ఆగ్రాలో కాకుండా 2001 జూలై 14న న్యూదిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగింది.

టిప్నిస్ యూనిఫాంలో ఉన్నప్పటికీ సెల్యూట్‌కు బదులుగా షేక్ హ్యాండ్ ఇచ్చారు. ప్రోటోకాల్ ప్రకారం మూడు సాయుధ దళాలకు ప్రాతినిధ్యం వహించే అధిపతులకు ఈ ఆప్షన్ ఉంటుంది. సర్వీస్ పరంగా టిప్నిస్ కంటే ముషారఫ్ జూనియర్ అని జూలై 15, 2001న ' ది ట్రిబ్యూన్' పత్రిక రిపోర్ట్‌లో ఉంది.

2013లో డీఎన్ఏ వార్తాపత్రికలో ప్రచురితమైన ఒక వ్యాసంలో 2001లో తాను ముషారఫ్‌కు సెల్యూట్ చేయకపోవడానికి కారణం భారత సైనికులతో పాకిస్తానీ సైన్యం వైఖరి ఎప్పుడూ శత్రుత్వంతో ఉంటుందని, సెల్యూట్ చేయడం తప్పనిసరి కాదని, తాను మర్యాద పూర్వకంగా కరచాలనం చేశానని టిప్నిస్ స్వయంగా చెప్పారు.

పాకిస్తాన్, కార్గిల్, భారత్, వాజ్‌పేయి, నవాజ్ షరీఫ్, ఆపరేషన్ సఫేద్ సాగర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పర్వేజ్ ముషారఫ్

నవాజ్ షరీఫ్‌కు తెలియకుండా ముషారఫ్ ప్లాన్ వేశారా?

ముషారఫ్ ఒక్కరే ఈ మొత్తం ఆపరేషన్‌ను ప్లాన్ చేశారని, ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌కు ఈ ప్రణాళిక గురించి ఏమాత్రం తెలియదని ఆపరేషన్ సఫేద్ సాగర్ వెబ్ సిరీస్ ద్వారా తెలుస్తుంది. అయితే కార్గిల్ యుద్ధం తర్వాత పాకిస్తాన్ అప్పటి ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ పర్వేజ్ ముషారఫ్ భిన్నమైన ప్రకటనలు ఇచ్చారు. తనను "చీకట్లో ఉంచారని" 2007లో జర్నలిస్ట్ శేఖర్ గుప్తాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నవాజ్ షరీఫ్ చెప్పారు.

షరీఫ్‌కు అంతా తెలుసని 2006 జూలైలో బిజినెస్ ప్లస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఫోటోలను చూపించి ముషారఫ్ పేర్కొన్నారు.

1999 ఫిబ్రవరి 5న షరీఫ్ కేల్ (కశ్మీర్) పర్యటనకు సంబంధించిన నాలుగు ఫోటోలు చూపించారు. ఫిబ్రవరి 19న వాజ్‌పేయి లాహోర్ పర్యటనకు ముందే షరీఫ్ కేల్‌లో పర్యటించారు.

మరోవైపు కార్గిల్ సమయంలో ఐఎస్ఐకి నాయకత్వం వహించిన లెఫ్టినెంట్ జనరల్ షాహిద్ అజీజ్ తన 'హౌ లాంగ్ దిస్ సైలెన్స్' అనే పుస్తకంలో ముషారఫ్ కేవలం కొద్దిమంది సీనియర్ సైనికాధికారులతో కలిసి రహస్యంగా ఆ ఆపరేషన్‌ను నిర్వహించారని రాశారు.

2013లో 'ది ట్రిబ్యూన్'లో రాజ్ చెంగప్ప ఈ విషయాన్ని ఉటంకిస్తూ , మొత్తం ఐఎస్ఐకి కూడా ఈ ఆపరేషన్ తెలియదన్న అజీజ్ వాదనను నమ్మడం కష్టమని రాశారు.

పాకిస్తాన్, కార్గిల్, భారత్, వాజ్‌పేయి, నవాజ్ షరీఫ్, ఆపరేషన్ సఫేద్ సాగర్

ఫొటో సోర్స్, Nasir Kachroo/NurPhoto via Getty Images

ఫొటో క్యాప్షన్, టైగర్ హిల్

కార్గిల్ యుద్ధంలో సైన్యానికి, వైమానిక దళానికి మధ్య సమన్వయ లోపం ఉండేదా?

సంక్షోభ సమయంలో సైన్యం, వైమానిక దళం పాకిస్తాన్‌పై తక్షణమే ఆపరేషన్ ప్రారంభించాయని 'ఆపరేషన్ సఫేద్ సాగర్' వెబ్ సిరీస్ చూపిస్తుంది.

కానీ నిజంగా అలా జరిగిందా?

మాజీ వైమానిక దళ అధిపతి ఏవై టిప్నిస్ రాసిన ఒక వ్యాసం "ఫోర్స్" పత్రికలో అక్టోబరు 2006లో, ప్రచురితమైంది ( దీనిని 2024లో "ది వైర్" తిరిగి ప్రచురించింది ). 1999 మే 10 నుంచి 25 మధ్య సైన్యానికి, వైమానిక దళానికి మధ్య తీవ్రమైన విభేదాలు ఉన్నాయని, ఏ స్థాయిలోనూ ఈ రెండింటి మధ్య ఉమ్మడి ప్రణాళిక లేకపోవడమే అతిపెద్ద సమస్య అని అందులో రాశారు.

ఆర్మీ వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ చంద్రశేఖర్ యుద్ధ విమానాల వాడకానికి మాత్రమే ప్రభుత్వ అనుమతి అవసరమని, హెలికాప్టర్ల వాడకం సర్వీస్ హెడ్ క్వార్టర్స్ అంతర్గత నిర్ణయమని వాదిస్తూ వాయుసేన నుంచి ఎంఐ-17 హెలికాప్టర్ల ఫైర్ సపోర్ట్‌ను మే 14న అభ్యర్థించారు. సహాయం అందించడానికి టిప్నిస్ వ్యతిరేకించలేదు. కానీ ఆయన రెండు విషయాలపై పట్టుబట్టారు.

1. ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా ఉండాలి.

2. ఆ భూభాగంలో దాడి చేసే పాత్రలో ఉన్న హెలికాప్టర్లు స్టింగర్ క్షిపణులకు సులభంగా దొరికిపోతాయి.

చివరకు మే 24న జనరల్ వేద్ మాలిక్‌తో జరిగిన చర్చల అనంతరం ఆయన అంగీకరించగా మే 25న ప్రధానమంత్రి వాజ్‌పేయి ఆమోదంతో మే 26న ఆపరేషన్ ప్రారంభమైంది. మే 28న ఒక స్టింగర్ క్షిపణి దాడిలో ఎంఐ-17 హెలికాప్టర్ కూలిపోవడంతో నలుగురు వైమానిక సిబ్బంది మరణించారు.

టిప్నిస్ వ్యాసంపై వివాదం చెలరేగింది.

చొరబాటు తీవ్రత గురించి ప్రభుత్వానికి తెలియజేయడానికి సైన్యం సంకోచించిందని ఆయన వాదించారు. దీనికి ప్రతిస్పందనగా జనరల్ వి.పి. మాలిక్ జూలై 7, 1999న టిప్నిస్ రాసిన ఒక లేఖను విడుదల చేశారు. కార్గిల్‌లోని సైనిక సిబ్బంది ధైర్యాన్ని ఆ లేఖలో టిప్నిస్ బహిరంగంగా ప్రశంసించారు. మాలిక్ ఈ పూర్తి వివరాలను తన "కార్గిల్: ఫ్రమ్ సర్‌ప్రైజ్ టు విక్టరీ" అనే పుస్తకంలో పొందుపరిచారు. అదే ట్రిబ్యూన్ రిపోర్ట్‌లో ఈ విభేదాలు ఆపరేషన్‌పై ప్రభావం చూపలేదని కూడా టిప్నిస్ పేర్కొన్నారు.

"కార్గిల్ యుద్ధ సమయంలో, సంయుక్త కార్యకలాపాలు నిర్వహించడంలో సైన్యం, వైమానిక దళం మధ్య అనేక సమస్యలు తలెత్తాయి. ఈ సమస్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి’’ అని అన్నారు. కార్గిల్ పోరాటాన్ని ఒక "గూఢచార వైఫల్యం"గా ఆయన అభివర్ణించారు.

"వాజ్‌పేయి లాహోర్‌కు చేరుకోవడానికి ముందే పాకిస్తానీ సైనిక విభాగాలు నియంత్రణ రేఖను దాటడం ప్రారంభించాయి. ఎందుకంటే శీతాకాలంలో భారత సైన్యం ఎత్తైన పర్వతాల నుంచి కిందికి దిగి వస్తుంది" అని ఆయన అంటున్నారు.

"సైన్యానికి ముందుగానే నిఘా సమాచారం అంది ఉంటే కార్గిల్ యుద్ధాన్ని నివారించి ఉండవచ్చు" అని చెప్పారు.

పాకిస్తాన్, కార్గిల్, భారత్, వాజ్‌పేయి, నవాజ్ షరీఫ్, ఆపరేషన్ సఫేద్ సాగర్

ఫొటో సోర్స్, OHN MACDOUGALL/AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, ముషారఫ్, వాజ్‌పేయి

17వ స్క్వాడ్రన్ 'గోల్డెన్ యారోస్' అసలు పని ఏంటి?

ఒక కొండపైకి శత్రువుల చొరబాటును ఎలా కనుగొందో వివరిస్తూ గోల్డెన్ యారోస్ స్క్వాడ్రన్‌ను ఆపరేషన్ సఫేద్ సాగర్ ప్రస్తావిస్తుంది.

గోల్డెన్ యారోస్ ప్రధానంగా ఒక నిఘా స్క్వాడ్రన్. కార్గిల్ యుద్ధ సమయంలో మాజీ వైమానిక దళ అధిపతి బీఎస్ ధనోవా 17వ స్క్వాడ్రన్‌కు కమాండింగ్ ఆఫీసర్‌. ఒక ఇంటర్వ్యూలో ఆయన "ఆపరేషన్ సఫేద్ సాగర్ మొదటి మిషన్‌ను గోల్డెన్ యారోస్ నిర్వహించింది" అని అన్నారు.

అప్రమత్తంగా ఉండాలని మొత్తం వైమానిక దళాన్ని ఆ సమయంలో ఎయిర్ చీఫ్ మార్షల్ టిప్నిస్ ఆదేశించారు.

"మా స్క్వాడ్రన్ పాత్ర గస్తీ నిర్వహించడం. ఆ తర్వాత స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహుజా, లెఫ్టినెంట్ కె. నచికేత ప్రమాదానికి గురయ్యాక బాంబింగ్ బాధ్యతలు ఇవ్వాలని మేం విజ్ఞప్తి చేశాం. అనంతరం మా స్క్వాడ్రన్‌కు చెందిన ఆరు విమానాలకు బాంబుదాడుల బాధ్యత అప్పగించారు. ఇదే స్క్వాడ్రన్ ఇప్పుడు రఫేల్ యుద్ధ విమానాలను నడుపుతోంది" అని బీఎస్ ధనోవా చెప్పారు.

పాకిస్తాన్, కార్గిల్, భారత్, వాజ్‌పేయి, నవాజ్ షరీఫ్, ఆపరేషన్ సఫేద్ సాగర్

ఫొటో సోర్స్, MUSTAFA TAUSEEF/AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, అజయ్ ఆహుజా మృతదేహాన్ని 1999 మే 30న శ్రీనగర్ ఎయిర్‌పోర్టుకు తీసుకొచ్చారు.

స్క్వాడ్రన్ లీడర్ అజయ్ ఆహుజా ఎలా మరణించారు?

కార్గిల్ యుద్ధ సమయంలో ఇంజన్ వైఫల్యం కారణంగా లెఫ్టినెంట్ కె. నచికేత విమానం కూలిపోయింది. కూలిపోయిన ఆ విమానం కోసం గాలిస్తున్న స్క్వాడ్రన్ లీడర్ అజయ్ ఆహుజా విమానంపై ఎత్తైన కొండలపై మోహరించి ఉన్న పాకిస్తానీ సైనికులు క్షిపణి దాడి చేశారు.

స్క్వాడ్రన్ లీడర్ అజయ్ ఆహుజా యుద్ధ విమానం క్షిపణి దాడికి గురై కూలిపోయింది.

"ఎజెక్షన్ సీటు ఆయనకు రెండో జీవితాన్ని ఇచ్చింది. కానీ శత్రువుల క్రూరత్వం నుంచి తప్పించుకోవడానికి ఆయనకు మూడో జీవితం అవసరమైంది" అని టిప్నిస్ రాశారు.

"ఫైటర్ జెట్ నుంచి బయటకు దూకిన తర్వాత స్క్వాడ్రన్ లీడర్ అజయ్ ఆహుజాను పాకిస్తాన్ బందీగా పట్టుకుంది" అని తెలిపారు.

భారత అధికారిక పోస్ట్‌మార్టం ప్రకారం ఆయన ఫైటర్ జెట్ నుంచి దిగిన తర్వాత పాకిస్తానీ సైనికుల కాల్పుల్లో మరణించారు. ఇది కార్గిల్ యుద్ధంలోని అత్యంత విషాదకరమైన సంఘటనల్లో ఒకటి.

ఏ వెబ్ సిరీస్ కూడా సంపూర్ణ చరిత్ర పుస్తకం కాలేదు. ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే, దానికి కొంత నాటకీయత, కొంత భావోద్వేగం, సమయోచితమైన పోలికలు అవసరం. ఒకప్పుడు కేవలం ఫైళ్లలో లేదా సైనిక పత్రికల్లో మాత్రమే ప్రస్తావనకు వచ్చిన విషయాలను, ఆ పైలట్లను, ఆ విమానాలను, ఆ సంఘటనలను 'ఆపరేషన్ సఫేద్ సాగర్' తిరిగి వెలుగులోకి తెస్తోంది.

పాకిస్తాన్, కార్గిల్, భారత్, వాజ్‌పేయి, నవాజ్ షరీఫ్, ఆపరేషన్ సఫేద్ సాగర్

ఫొటో సోర్స్, MUSTAFA TAUSEEF/AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, 1999 మే 26న భారత సైనికుడు(ఫైల్ ఫోటో)

కార్గిల్‌లో ఏం జరిగింది?

1999 మే నెలలో కార్గిల్ పర్వత ప్రాంతాల్లో భారత్, పాకిస్తాన్‌ మధ్య యుద్ధం జరిగింది. పాకిస్తానీ సైనికులు చొరబడి ఎత్తైన కార్గిల్ కొండలపై స్థావరాలను ఏర్పాటు చేసుకోవడంతో ఈ యుద్ధం ప్రారంభమైంది.

వంద కిలోమీటర్ల పరిధిలో జరిగిన ఈ పోరాటంలో సుమారు 1,700 మంది పాకిస్తానీ సైనికులు భారత సరిహద్దులోకి 8 లేదా 9 కిలోమీటర్ల మేర చొరబడ్డారు. ఈ మొత్తం ఆపరేషన్‌లో 527 మంది భారత సైనికులు మరణించగా 1,363 మంది గాయపడ్డారు.

ప్రారంభంలో భారత్ రెండు మిగ్ విమానాలను, ఒక హెలికాప్టర్‌ను కోల్పోయింది. కానీ భారత వైమానిక దళం, బోఫోర్స్ ఫిరంగులు పాకిస్తానీ స్థావరాలపై పదేపదే తీవ్రంగా దాడులు చేశాయి.

నసీమ్ జెహ్రా తన 'ఫ్రమ్ కార్గిల్ టు ది కూ' అనే పుస్తకంలో ఇలా రాశారు.

'ఈ దాడులు ఎంత తీవ్రంగా, కచ్చితంగా జరిగాయంటే అవి పాకిస్తానీ స్థావరాలు పూర్తిగా ధ్వంసం చేశాయి. పాకిస్తానీ సైనికులు ఎలాంటి సరఫరా వ్యవస్థ లేకుండా పోరాడారు. సరైన నిర్వహణ లేకపోవడం వల్ల వారి తుపాకులు కేవలం పుల్లలుగా మారిపోయాయి' అని రాశారు.

ఒక చిన్న ప్రాంతంపై వందలాది ఫిరంగి గుళ్ల వర్షం కురిపించడం అనేది ఒక పెద్ద సుత్తితో వాల్‌నట్‌ను పగలగొట్టడం లాంటిదని భారత సైన్యం స్వయంగా అంగీకరించింది.

కార్గిల్ యుద్ధంలో కమాండర్‌గా పనిచేసిన లెఫ్టినెంట్ జనరల్ మొహిందర్ పూరి కార్గిల్‌లో వైమానిక దళం అత్యంత ముఖ్యమైన పాత్ర మానసిక ఒత్తిడి సృష్టించడంలో ఉందని నమ్ముతారు.

‘‘తలపైన భారత యుద్ధవిమానాల శబ్దం వినపడగానే పాకిస్తానీ సైనికులు భయపడి వివిధ దిశల్లో పారిపోయేవారు’’ అని మొహిందర్ పూరి చెప్పారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)