లోక్సభ: వీగిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, మూడింట రెండువంతుల మెజారిటీ సాధించలేకపోయిన ఎన్డీయే

ఫొటో సోర్స్, Sansad TV
లోక్సభలో శుక్రవారం జరిగిన ఓటింగ్లో మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లు (131వ) వీగిపోయింది.
ఈ బిల్లు నెగ్గడానికి కావల్సిన మూడింట రెండొంతుల ఓట్లను సాధించడంలో ఎన్డీయే విఫలమైంది.
బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి.
మిగిలిన రెండు సవరణ బిల్లులతో ముందుకు వెళ్లరాదని నిర్ణయించినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రెజిజు తెలిపారు.
మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే చట్ట సవరణ, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన బిల్లులపై పార్లమెంటులో అధికార, ప్రతిపక్ష ఎంపీల మధ్య చర్చ అనంతరం హోం మంత్రి అమిత్ షా స్పందించగా, దానిపై ఓటింగ్ జరిగింది.

కేంద్ర ప్రభుత్వ న్యాయ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, మహిళా రిజర్వేషన్ చట్టం 2023 గురువారం (ఏప్రిల్ 16, 2026) నుండి అమల్లోకి వచ్చింది.
ఈ చట్టం పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తుంది.
అయితే, ప్రభుత్వం ప్రతిపాదించిన రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు 2026 ప్రకారం, నియోజకవర్గాల పునర్విభజన ఆధారంగానే సీట్లలో మహిళా రిజర్వేషన్ను అమలు చేస్తారు.
అయితే, ఈ చర్యను వ్యతిరేకిస్తున్నవారు, 33 శాతం రిజర్వేషన్ను కేవలం లోక్సభలోని ప్రస్తుత 543 సీట్లకు మాత్రమే ఇవ్వాలని, నియోజకవర్గాల పునర్విభజన ఆధారంగా పెంచిన సీట్లకు కాదని వాదిస్తున్నారు.

ఫొటో సోర్స్, Sansad TV
అంతకుముందు, మహిళా రిజర్వేషన్లపై రాజ్యాంగ సవరణపై జరిగిన చర్చ అనంతరం, ప్రతిపక్షం మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకిస్తోందని హోం మంత్రి అమిత్ షా అన్నారు.
"ఇండీ అలయన్స్ సభ్యులందరూ తమ షరతులతో మహిళా రిజర్వేషన్లను స్పష్టంగా వ్యతిరేకించారు. చాలాచోట్ల, ఈ వ్యతిరేకత మా దార్శనికతకు కాకుండా, మేము అమలు చేస్తున్న తీరుకే పరిమితమైనట్లు కనిపిస్తోంది" అని ఆయన అన్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)

































