ఫేస్‌బుక్‌లో ప్రధాని మోదీ పోస్ట్ తొలగింపుపై ఐటీ శాఖ ఏమంది?

ప్రధాని నరేంద్ర మోదీకి చెందిన ఒక పోస్ట్‌ను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్ (మెటా) భారతదేశంలో కొద్దిసేపు తొలగించింది. "ప్రధాని అధికారిక హ్యాండిల్ నుంచి ధ్రువీకరించిన కంటెంట్‌ను తొలగించడం తీవ్రమైన విషయం. ఇలా జరిగి ఉండకూడదు" అని ఐటీ శాఖ కార్యదర్శి ఎస్. కృష్ణన్ వార్తాసంస్థ ఏఎన్‌ఐతో చెప్పారు.

సారాంశం

  • దక్షిణ జపాన్‌లో మంగళవారం 7.1 తీవ్రతతో ఏర్పడిన భూకంపం ప్రజలను ఆందోళనలో పడేసింది. అధికారుల సమాచారం ప్రకారం, భూకంపం ధాటికి కుమామోటోలోని ఒక షాపింగ్ మాల్‌లో పలువురు ప్రజలు చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో చాలామంది గాయపడినట్లు రిపోర్టులు చెబుతున్నాయి.
  • కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ లోక్‌సభలో వాయిదా తీర్మాన నోటీసు ఇచ్చారు. జులై 20న పార్లమెంట్ మార్చ్ సమయంలో నిరసనకారులపై ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్(ఆర్ఏఎఫ్)పెల్లెట్ గన్స్ ఉపయోగించిందనే ఆరోపణలపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు.
  • సోషల్ మీడియా, ఇంటర్నెట్‌లో తనకు పరువు నష్టం కలిగించేలా ఉన్న డీప్‌ఫేక్, ఏఐ పోస్టులపై సివిల్ దావా దాఖలు చేయడానికి కేంద్ర మంత్రి, సీనియర్ బీజేపీ నాయకుడు నితిన్ గడ్కరీకి బాంబే హైకోర్టు అనుమతి ఇచ్చింది.
  • ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత, ఇకపై 'E20' కి వ్యతిరేకంగా గళం విప్పుతామని దిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. "ఈ అంశంపై అందరినీ ఒక తాటిపైకి తీసుకురావడానికి, శనివారం(ఆగస్టు 1) మధ్యాహ్నం 12 గంటల నుంచి E20కి వ్యతిరేకంగా నేషనల్ టౌన్‌హాల్ నిర్వహిస్తున్నాం" అన్నారు.
  • ఇరాన్‌తో 'చాలా స్నేహపూర్వక చర్చలు' జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అన్నారు. "ఈ యుద్ధాన్ని ముగించేందుకు మంచి అవకాశం ఉందని నేను భావిస్తున్నాను" అని ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ అన్నారు.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

  2. ఫేస్‌బుక్‌లో ప్రధాని మోదీ పోస్ట్ తొలగింపుపై ఐటీ శాఖ ఏమంది?

    నరేంద్ర మోదీ, వీడియో తొలగింపు, మెటా

    ఫొటో సోర్స్, Ajay Aggarwal/Hindustan Times via Getty Images

    ప్రధాని నరేంద్ర మోదీకి చెందిన ఒక పోస్ట్‌ను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్ (మెటా) భారతదేశంలో కొద్దిసేపు తొలగించింది. ఈ వ్యవహారాన్ని ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ కార్యదర్శి ఎస్.కృష్ణన్ 'తీవ్ర ఆందోళనకరమైన విషయం' అని వ్యాఖ్యానించారు.

    "ప్రధాని అధికారిక హ్యాండిల్ నుంచి ధ్రువీకరించిన కంటెంట్‌ను తొలగించడం తీవ్రమైన విషయం. ఇలా జరిగి ఉండకూడదు" అని ఏఎన్ఐ వార్తాసంస్థతో కృష్ణన్ అన్నారు.

    ఈ విషయంలో మెటా సంస్థ బేషరతుగా క్షమాపణలు చెప్పడం మంచి పరిణామమేనని ఆయన అభిప్రాయపడ్డారు.

    అయినప్పటికీ, "మెటా దీనికి సాంకేతిక లోపాన్ని కారణంగా చూపిస్తోంది, కానీ ఈ వివరణ ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. దీనిపై వారి నుంచి మరిన్ని వివరాలు కోరాం. అసలు ఇలాంటి పరిస్థితి ఎలా తలెత్తిందో అర్థం చేసుకోవడానికి సాంకేతిక స్థాయిలో సమావేశం నిర్వహిస్తాం" అన్నారు.

    భారతదేశంలోని ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలు సురక్షితంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనుకుంటోందని ఐటీ కార్యదర్శి తెలిపారు.

    "ఒకసారి ఖాతా వెరిఫై అయిన తర్వాత, అందులో పోస్ట్ చేసిన కంటెంట్ ఇలాంటి స్వల్ప సాంకేతిక లోపాలు లేదా పొరపాట్ల వల్ల తొలగించకుండా చూసుకోవాలి. ఇది చాలా దురదృష్టకరం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన సంస్కరణల కోసం ఈ అంశాన్ని మేం నిరంతరం పర్యవేక్షిస్తాం" అని ఆయన పేర్కొన్నారు.

    ప్రధాని మోదీకి చెందిన ఏ పోస్ట్‌ను ఫేస్‌బుక్ తొలగించిందనే విషయమై అధికారికంగా ఎటువంటి సమాచారం వెల్లడి కాలేదు. అయితే, జులై 23న పోస్ట్ చేసిన ఒక వీడియోను తొలగించారని, అందులో ప్రధాని మోదీ యువతను, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారని వార్తాసంస్థ 'పీటీఐ' రిపోర్ట్ చేసింది

  3. జపాన్‌లో భూకంపం, షాపింగ్ మాల్‌లో చిక్కుకున్న జనం

    జపాన్ భూకంపం

    ఫొటో సోర్స్, Reuters

    ఫొటో క్యాప్షన్, జపాన్‌లో భూకంపం సంభవించిన తర్వాత కుమామోటోలోని 'అయాన్ మాల్' లో పేలుడు సంభవించినట్లు రిపోర్టులు చెబుతున్నాయి.

    దక్షిణ జపాన్‌లో మంగళవారం 7.1 తీవ్రతతో ఏర్పడిన భూకంపం ప్రజలను ఆందోళనలో పడేసింది. అధికారుల సమాచారం ప్రకారం, భూకంపం ధాటికి కుమామోటోలోని ఒక షాపింగ్ మాల్‌లో పలువురు ప్రజలు చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో చాలామంది గాయపడినట్లు రిపోర్టులు చెబుతున్నాయి.

    స్థానిక మీడియా కథనాల ప్రకారం.. భూకంపం సంభవించిన తర్వాత కుమామోటోలోని 'అయాన్ మాల్' లో పేలుడు సంభవించింది. అయితే, ఈ పేలుడుకు గల కారణాలు, జరిగిన నష్టానికి సంబంధించిన అధికారిక వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

    కుమామోటో ప్రిఫెక్చర్‌లో క్యుషు ఎక్స్‌ప్రెస్‌వే దెబ్బతింది, ప్రాంతంలోని పలు భవనాలు ధ్వంసమయ్యాయి.

    స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 4:27 గంటలకు జపాన్‌లోని క్యుషు ద్వీపకల్ప అంతర్భాగంలో ఈ భూకంపం సంభవించింది. భూ ప్రకంపనల అనంతరం సునామీ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, దాదాపు గంట వ్యవధిలోనే వాటిని ఉపసంహరించుకున్నారు.

    జపాన్ భూకంపం

    ఫొటో సోర్స్, JIJI Press/AFP via Getty Images

    ఫొటో క్యాప్షన్, భూకంపం ధాటికి కుమామోటో నగరంలో కూలిన దుకాణం గోడ

    ముందుజాగ్రత్త చర్యగా సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని 1.5 లక్షల మందికి పైగా ప్రజలకు యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ప్రభావిత ప్రాంతాల్లో సహాయక బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలను ముమ్మరం చేశాయి.

    ప్రపంచంలోనే అత్యధికంగా భూకంపాలు సంభవించే దేశాల్లో జపాన్ ఒకటి. ఇక్కడ ప్రతి ఏటా సగటున దాదాపు 1,500 వరకు భూకంపాలు నమోదవుతుంటాయి.

  4. ఎన్నికల్లో పోటీ వయసు 21ఏళ్లకు తగ్గించాలా...రేవంత్ రెడ్డి ప్రతిపాదనకు కారణమేంటి?

  5. అరుణాచలం: అడుగు వెడల్పున్న ‘మోక్ష మార్గం’లో చిక్కుకుని మరణించిన ఆంధ్రప్రదేశ్ భక్తుడు

  6. 'మా నాన్న కల నెరవేర్చడానికి.. కార్ల మీదే సముద్రాన్ని దాటేశాం' అంటున్న యువకుల కథ

  7. జౌహార్ యూనివర్శిటీ భవనాల కూల్చివేతపై తాత్కాలిక స్టే, విద్యార్థులు ఏమంటున్నారు?

  8. నా మీద కేసులన్నీ భూకబ్జాదారులు వేసినవే: హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్

    రంగనాథ్

    ఫొటో సోర్స్, BBC/HYDRAA

    హైడ్రా కమిషనర్ పదవి నుంచి ఏవీ రంగనాథ్‌ను తప్పించాలని తెలంగాణ హైకోర్టు సోమవారం ప్రభుత్వప్రధాన కార్యదర్శిని ఆదేశించిన నేపథ్యంలో ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

    తాను రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరించి.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 48ఏ ప్రకారం ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, పార్కులను గత రెండేళ్లుగా రక్షిస్తున్నానని రంగనాథ్ ఆ ప్రకటనలో చెప్పుకొచ్చారు.

    ‘ఆరు చెరువులను పూర్తి స్థాయిలో పున‌రుద్ధ‌రించాం.మరో 20 చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ ప‌నులు కూడా వేగంగా జ‌రుగుతున్నాయి. బడా బాబులు ఆక్రమించిన వందల చెరువులు, పార్కులు, వేల ఎకరాల ప్రభుత్వ భూముల ను హైడ్రా ఈ రెండు సంవత్సరాల లో వెనక్కి తీసుకుని ప్రభుత్వానికి అప్పగించింది. నిజం వైపు నిజాయితీ గా నిర్భయంగా, నిబద్ధతతో పని చేస్తాం కాబట్టే హైడ్రాకు ధైర్యం. ల్యాండ్ మాఫియా , భూ కబ్జా దారులు తప్పుడు సమాచారం తో కోర్ట్ లను తప్పుదోవ పట్టిస్తున్నారు. నా మీద 63 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి.. వాటిని వేసింది బడా భూ కబ్జా దారులే. బ‌తుక‌మ్మ‌ కుంట చెరువును మింగేయాలని చూసిన ఒకరు, లోతుకుంటలో రూ. వేల కోట్ల ప్రభుత్వ భూమి ని కొట్టేయాలని చూసిన ఇంకొకరు, సామాన్యుల ప్లాట్లు కొట్టేసి బడా కాంప్లెక్స్ లు కట్టాలని చూస్తున్న మరొకరు.. వేల సంఖ్య‌లో ఉన్న‌ సింగరేణి కార్మికుల ప్లాట్స్‌ను కొట్టేయాలని చూసినవారు, ప్రభుత్వ భూములను ఆక్రమించినవారికి హైడ్రా కమిషనర్‌గా అడ్డు పడడటమే నేను చేసిన తప్పు. వీళ్లంతా వేసిన కేసులే నా మీద ఉన్న 63 కోర్ట్ ధిక్కార కేసులు. వాటిని నేను చట్ట పరంగా నే ఎదుర్కొంటాను. నాకు న్యాయస్థానాలు అంటే పూర్తి నమ్మకం’ అని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు.

  9. ఎన్టీఆర్ భుజానికి గాయం - 6 నుంచి 8 వారాల కంప్లీట్ రెస్ట్ సూచించిన వైద్యులు

    ntr

    ఫొటో సోర్స్, Getty Images

    హీరో ఎన్టీఆర్ భుజానికి సోమవారం సాయంత్రం గాయమైందని ఆయన కార్యాలయం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది.

    ‘డాక్టర్ జె.మధుసూదన్ రావు, ఆర్ఏ పూర్ణచంద్ర తేజస్వి నేతృత్వంలోని వైద్యబృందం వైద్య పరీక్షలు నిర్వహించి 6 నుంచి 8 వారాల పూర్తి విశ్రాంతి అవసరమని సూచించారు’ అని సోమవారం రాత్రి విడుదల చేసిన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

    ఎన్టీఆర్ ఆరోగ్యం గురించి ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిందేమీ లేదని, ఆయన ఆరోగ్యం, కోలుకోవడం గురించి తగిన సమయంలో తాము అప్డేట్స్ ఇస్తామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

    NTR health

    ఫొటో సోర్స్, NTR office

  10. నెతన్యాహును అరెస్టు చేసే అధికారం నాకు లేదు: మమ్దానీ

    అమెరికా, న్యూయార్క్, ఇజ్రాయెల్, నెతన్యాహు

    ఫొటో సోర్స్, Michael M. Santiago/Getty Images

    ఫొటో క్యాప్షన్, న్యూయార్క్ మేయర్

    ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో మాటల యుద్ధం లేదా ఆరోపణల పర్వంలో పాల్గొనడంపై తనకు ఆసక్తి లేదని న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ అన్నారు.

    నెతన్యాహు న్యూయార్క్ వస్తే అరెస్టు చేయడానికి సంబంధించిన ప్రశ్నలకు మమ్దానీ స్పందించారు.

    అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకు సంబంధించి గతంలో చేసిన వ్యాఖ్యల గురించి అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌తో చర్చించారా అని అడగ్గా, ట్రంప్‌తో జరిగిన తన సంభాషణను బహిరంగంగా వెల్లడించబోనని మమ్దానీ అన్నారు.

    న్యూయార్క్ ప్రజలందరికీ భద్రత కల్పించడమే తన ప్రాధాన్యత అని స్పష్టంచేశారు.

    నెతన్యాహు చేసిన వ్యాఖ్యలపై మమ్దానీ స్పందించలేదు.

    అంతకుముందు ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి హాజరయ్యేందుకు సెప్టెంబరు చివరిలో తాను న్యూయార్క్ వెళ్తానని నెతన్యాహు చెప్పారు.

    మమ్దానీ విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారని నెతన్యాహు ఆరోపించారు.

    నెతన్యాహు న్యూయార్క్‌కు వస్తే అరెస్టు చేస్తానని గతంలో జోహ్రాన్ మమ్దానీ హెచ్చరించారు.

    ఆ తర్వాత తన ప్రకటనను ఆయన ఉపసంహరించుకున్నారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) జారీ చేసిన అరెస్టు వారెంట్ ఆధారంగా నెతన్యాహును అరెస్టు చేయడానికి చట్టపరమైన అధికారం తనకు లేదని ఆయన అంగీకరించారు.

  11. ఫ్రాన్స్‌లో ఇంకా అదుపులోకి రాని కార్చిచ్చు

    ఫ్రాన్స్, కార్చిచ్చు, యూరప్

    ఫొటో సోర్స్, Kenzo TRIBOUILLARD / POOL / AFP via Getty Images

    ఫొటో క్యాప్షన్, బోర్డో నగరానికి 15కిలోమీటర్ల దూరానికి కార్చిచ్చు వ్యాపించింది.

    ఫ్రాన్స్‌లో చెలరేగిన కార్చిచ్చు ఇప్పుడు నైరుతి నగరమైన బోర్డోకు కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉంది.

    ఎలాంటి పరిస్థితినయినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బోర్డో మేయర్ థామస్ కాజెనావ్ చెప్పారు.

    "మరింత మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలొస్తే, అందుకు తగ్గట్టుగా భారీ సంఖ్యలో ప్రజలకు తాత్కాలిక వసతి కల్పించే ఏర్పాట్లు చేస్తున్నాం’’ అని మేయర్ థామస్ కాజెనవే అన్నారు.

    కార్చిచ్చుతో ప్రభావితమైన గిరోండ్ ప్రాంతాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ పరిశీలించారు. దేశం ఇప్పటివరకూ ఎప్పుడూ చూడని స్థాయిలో కార్చిచ్చు ప్రభావం ఉందని ఆయన చెప్పారు.

    రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఫ్రాన్స్‌లో ఇది అత్యంత ఘోరమైన కార్చిచ్చు అని మేక్రాన్ తెలిపారు.

    కార్చిచ్చు ఫ్రాన్స్‌పై తీవ్ర ప్రబావం చూపింది. నైరుతి ఫ్రాన్స్‌లో 42వేల హెక్టార్లు కాలిపోయాయి.

    గత వారం నుంచి యూరప్‌లోని అనేక ప్రాంతాల్లో కార్చిచ్చులు వ్యాపిస్తున్నాయి.

  12. యుద్ధం త్వరలో ముగిసే అవకాశం ఉందన్న ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ ఎలా స్పందించింది?

    అమెరికా, ఇరాన్

    ఫొటో సోర్స్, Reuters

    ఫొటో క్యాప్షన్, ట్రంప్

    ఇరాన్‌తో 'చాలా స్నేహపూర్వక చర్చలు' జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అన్నారు.

    వరుసగా మూడో రోజు కూడా ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోలేదు.

    "ఈ యుద్ధాన్ని ముగించేందుకు మంచి అవకాశం ఉందని నేను భావిస్తున్నాను" అని ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ అన్నారు.

    ఈ చర్చలు విఫలమైతే, కాల్పుల విరమణకు ముందు తీసుకున్న చర్యలనే అమెరికా మళ్లీ ప్రారంభిస్తుందని ఆయన హెచ్చరించారు.

    మరోవైపు ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ ఖండించింది. అమెరికాతో ఎలాంటి ప్రత్యక్ష చర్చలు జరపడం లేదని తెలిపింది.

    మధ్యవర్తిత్వం వహిస్తున్న దేశాలు చర్చలకు మరో అవకాశం కోరడంతో శుక్రవారం(జూలై 24) ఇరాన్‌పై దాడులను నిలిపివేసినట్టు ట్రంప్ తెలిపారు.

    ఇరాన్ కూడా ప్రస్తుతానికి తన దాడులను నిలిపివేసింది.

    దాదాపు రెండు వారాల తర్వాత ఈ విరామం వచ్చింది.

  13. నిరసనకారులపై ఎఫ్ఐఆర్‌ల ఉపసంహరణ హామీ నోటిఫికేషన్‌ను రేపటిలోపు విడుదల చేయాలి- సీజేపీ

    దిల్లీ, నిరసన, కేసులు, కాక్రోచ్ జనతా పార్టీ

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, దిల్లీలో యువత ఆందోళన(ఫైల్ ఫోటోె)

    నిరసనకారులపై నమోదు చేసిన అన్ని ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించుకుంటామని బిహార్, అసోం ప్రభుత్వాలు హామీ ఇచ్చాయని కాక్రోచ్ జనతా పార్టీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ అన్నారు.

    పార్టీ పత్రికా సమావేశం అనంతరం ప్రభుత్వ ప్రతినిధులు తనను, తన సహచరులను కలిశారని ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో సౌరవ్ దాస్ తెలిపారు.

    "ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశం రెండుమూడు గంటల పాటు జరిగింది. నిరసనకారులపై దాఖలైన అన్ని ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించుకుంటామని హామీ ఇస్తూ బిహార్, అసోం ప్రభుత్వాలు జారీ చేసిన నోటిఫికేషన్ల కాపీలను వారు షేర్ చేశారు’’ అని సౌరవ్ దాస్ చెప్పారు.

    ‘‘నిరసనకారులపై భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోబోరని కూడా ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అదుపులోకి తీసుకున్న, అరెస్టు చేసిన వారందరినీ కూడా విడుదల చేస్తామని చెప్పారు’’ అని సౌరవ్ దాస్ వివరించారు.

    ‘‘కేంద్ర ప్రభుత్వం, ఇతర బీజేపీ, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల నుంచి ఇలాంటి హామీలతో కూడిన నోటిఫికేషన్లు రేపటిలోగా జారీ చేస్తామని హామీ ఇచ్చారు. ముందుగా అంగీకరించిన భాషనే ఉపయోగిస్తారని ఆశిస్తున్నాం. ఏ నిరసనకారుడినీ ఒంటరిగా వదిలిపెట్టం. ఈ పోరాటంలో మనమంతా కలిసి ఉన్నాం’’ అని సౌరవ్ దాస్ అన్నారు.

  14. బీబీసీ తెలుగు లైవ్ పేజ్‌కు స్వాగతం.

    నేను బీబీసీ ప్రతినిధి కమలాదేవి నల్లపనేని.

    ఇప్పటినుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ముఖ్యమైన వార్తలను లైవ్ పేజ్ ద్వారా మీకు అందిస్తాను.

    నిన్నటి లైవ్ పేజ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.