నియోజక వర్గాల పునర్విభజన: దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏమంటున్నారు?

చదివే సమయం: 4 నిమిషాలు

లోక్‌సభ సీట్ల సంఖ్య పెంపు, లోక్‌సభ, అసెంబ్లీలలో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లు అమలుకు ఉద్దేశించిన బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్రప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.

ఇందుకోసం ఏప్రిల్ 16 నుంచి 3 రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలను నిర్వహిస్తోంది.

2011 జనాభా లెక్కల ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజనతో పాటు మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడమే తమ లక్ష్యమని ఈ బిల్లులో పేర్కొన్నారు.

2026 జనగణన పూర్తయి వాటి ఫలితాలు వచ్చే సరికి ఆలస్యం అవుతుందని, అందుకే 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుని ఈ ప్రక్రియ మొదలుపెడుతున్నట్టు బిల్లులో పేర్కొన్నారు.

" తాజా జనగణన డిజిటల్‌గా చేయనున్నారు. వీటి ఫలితాలు 2027కల్లా అందుబాటులోకి వస్తాయి. ఇందులో కుల గణన కూడా జరుగుతుందని ప్రధాని చెప్పారు. అలాంటప్పుడు ఇంత హడావుడిగా నియోజకవర్గాల పునర్విభజన బిల్లు తేవాల్సిన అవసరం ఏముంది?" అని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ ది హిందూకు రాసిన వ్యాసంలో ప్రశ్నించారు. అయితే, కేంద్రం ప్రభుత్వం ఈ వాదనలను తిరస్కరిస్తోంది.

ఏయే సీఎంలు వ్యతిరేకించారు?

జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనను తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యతిరేకించారు.

దీని వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆరోపించారు.

"చట్టసభల్లో మహిళలకు 33 శాతం సీట్ల రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయడానికి సంపూర్ణ మద్దతునిస్తాం. కానీ లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పెంపునకు కేంద్రం ప్రకటించిన ప్రాతిపదిక దేశంలోని ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్య అంతరం పెంచడమే కాకుండా దేశానికి ప్రమాదకరంగా మారుతుంది" అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

జనాభా లెక్కల ప్రాతిపదికగా కాకుండా జీఎస్‌డీపీ (గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్) ఆధారిత హైబ్రీడ్ మోడల్‌ను రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. ప్రస్తుత 543 లోక్‌సభ స్థానాల్లో పెంచాలనుకుంటున్న 50 శాతం అంటే 272 స్థానాల్లో 136 సీట్లను ప్రొరేటా ప్రకారం, మిగిలిన 136 సీట్లను జాతీయ స్థూల ఉత్పత్తి ప్రాతిపదికన విభజించి అత్యధిక శాతం అందిస్తున్న రాష్ట్రాలకు ప్రాధాన్యతనివ్వాలని ఆయన సూచించారు.

నియోజకవర్గాల పునర్విభజనను తాము స్వాగతిస్తున్నామని అయితే జనాభా ప్రాతిపదికన కాకుండా దామాషా ప్రకారం పెంచాలని బీఆర్ఎస్ కార్య నిర్వహక అధ్యక్షుడు కేటీ రామారావు సూచించారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

అయితే, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న వాదనను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తప్పుబట్టారు. ఏ రాష్ట్రానికి అన్యాయం జరక్కుండా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ‘ఎక్స్‌‌’లో రాసిన ఓ పోస్టులో ఆయన స్పష్టం చేశారు.

‘నారీ శక్తి వందన్’

2029 ఎన్నికల నుంచే మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ల అమలు చేసేలా తీసుకువస్తున్న 'నారీ శక్తి వందన్'‌ చట్ట సవరణ బిల్లుకు మద్దతు పలకాలని ఏపీ సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

ఈ బిల్లుకు పార్లమెంట్‌లో మద్దతివ్వాలని కోరుతూ రాష్ట్రంలోని రాజకీయ పార్టీల అధ్యక్షులకు, రాజ్యసభ, లోక్ సభ ఎంపీలకు రాసిన లేఖను ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

"మహిళలకు పార్లమెంట్, విధాన సభల్లో మూడో వంతు రిజర్వేషన్లు కల్పించాలనే ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పాన్ని బలపరుద్దామని విజ్ఞప్తి చేశాను.. " అంటూ చంద్రబాబు ఎక్స్‌లో పోస్ట్ చేసిన సందేశంలో తెలిపారు.

ఏప్రిల్ 16 నుంచి జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో నిర్మాణాత్మక చర్చలు జరపడానికి, దేశంలో మహిళా నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలనే విస్తృత లక్ష్యానికి అండగా నిలిచేందుకు తెలుగుదేశం పార్టీ ఆసక్తిగా ఎదురుచూస్తోందని ఎక్స్‌లో టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు.

"మహిళల రిజర్వేషన్ చట్టం అమలవుతుంది. 2029కి ముందే నియోజకవర్గాల పునర్విభజన పూర్తవుతుంది. రాష్ట్రాల్లో ప్రో రేటా ప్రకారం సీట్లు 50శాతం పెరుగుతాయి" అని కృష్ణ దేవరాయలు చెప్పినట్లు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం తెలిపింది.

తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉందని.. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తమ పార్టీ బలపరుస్తుందని టీడీపీ అధికార ప్రతినిధి రాజేశ్ అప్పసాని బీబీసీతో చెప్పారు.

జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు అన్యాయం జరగదని గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

‘ఇది తమిళనాడు చివరి హెచ్చరిక’

నియోజకవర్గాల పునర్విభజనలో తమ రాష్ట్ర ప్రయోజనాలకు హాని కలిగితే తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ హెచ్చరించారు.

"ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న సమయంలో నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన రాజ్యాంగ సవరణలను పక్కన పెట్టి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాలను ఎందుకు నిర్వహిస్తోంది" అని ఆయన ప్రశ్నించారు.

"గౌరవ ప్రధానమంత్రిగారూ, ఇది తమిళనాడు చివరి హెచ్చరిక" అనే పేరుతో స్టాలిన్ ఎక్స్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు.

నియోజకవర్గాల పునర్విభజన పేరుతో ఆధిపత్యం చలాయించాలనే ప్రయత్నం సరికాదన్నారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.

"డీలిమిటేషన్ అనేది సీట్లు పెంచే కార్యక్రమం కాదు. దీని వల్ల ఎవరు లబ్ధిపొందుతున్నారో చూడాలి. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం చేపడుతున్న ప్రక్రియతో అధిక జనాభా ఉన్న రాష్ట్రాలకు లబ్ధి చేకూరుతుంది. కర్ణాటకతో పాటు దక్షిణాది రాష్ట్రాలు బలహీనమవుతాయి. సమాఖ్య వ్యవస్థ సమతుల్యతను దెబ్బ తీస్తుంది" అని సిద్ధరామయ్య తెలిపారు.

‘దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం’

ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా పోరాటంలో దక్షిణాది రాష్ట్రాలను ఏకం చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ప్రారంభించారు.

ఇందులో భాగంగానే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు రేవంత్ రెడ్డి తాజాగా లేఖ రాశారు.

జనాభా ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ సీట్లను పెంచితే జనాభా నియంత్రణ అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని స్టాలిన్‌కు రాసిన లేఖలో రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

మమతా బెనర్జీ సైతం..

పశ్చిమబెంగాల్‌ను భారత్ నుంచి విడదీసేందుకే కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన బిల్లును తీసుకువస్తోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు.

హౌరాలోని దొంజూర్‌లో ఏప్రిల్ 14న జరిగిన ఎన్నికల ప్రచార సభలో మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు.

"ఈ ప్రభుత్వానికి మెజార్టీ లేదు. అయినా సరే రాజకీయ ప్రయోజనాల కోసం ఈ పని చేస్తోంది" అని ఆమె అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)