You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఇంజన్ లేకుండానే రైలు 15 కిలోమీటర్లు నడిచింది.. ఎలా!?
డ్రైవర్లు లేని వాహనాలు వస్తున్నాయని ఈ మధ్య వింటున్నాం. కానీ అసలు ఇంజన్ లేకుండానే ఓ రైలు ఏకంగా పదిహేను కిలోమీటర్లు పరుగు తీసిన కనీవినీ ఎరుగని విచిత్ర సంఘటన ఒడిషాలో జరిగింది.
శనివారం రాత్రి 22 పెట్టెలు ఉన్న ఓ ప్యాసింజర్ రైలు టిట్లాగఢ్ స్టేషన్ నుంచి ఇంజన్ లేకుండానే 15 కి.మీ. దూరం వెళ్లింది.
రాత్రి సుమారు 10 గంటల సమయంలో అహ్మదాబాద్-పూరీ ఎక్స్ప్రెస్ టిట్లాగఢ్ స్టేషన్లో నిలబడి ఉంది. సంబల్పూర్ వెళ్లాల్సిన ఆ రైలు ఇంజన్ను అక్కడ మారుస్తున్నారు.
అయితే ఇంజన్ మార్చడానికి దాన్ని రైలు పెట్టెల నుంచి వేరు చేయగానే, పెట్టెలన్నీ ప్లాట్ఫామ్పై నుంచి కదిలి వెళ్లిపోయాయి. దీంతో ఆ రైలు పెట్టెలు వెళ్లే మార్గంలో రైల్వే సిబ్బందిని అప్రమత్తం చేసి గేట్లన్నిటినీ మూసివేయించారు.
సుమారు 15 కి.మీ ప్రయాణించాక రైలును రాత్రి 12 గంటల సమయంలో పట్టాలపై పెద్ద పెద్ద రాళ్లు అడ్డం పెట్టి కెసింగ స్టేషన్లో నిలిపేశారు.
ఈ ఘటనలో ప్రయాణికులు అంతా సురక్షితంగా ఉన్నారని రైల్వే శాఖ తెలిపింది.
ఇలా జరగడానికి కారణం రైలు డ్రైవర్ల నిర్లక్ష్యమే కారణమని ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రధాన భద్రతాధికారి ఎస్ఎస్ మిశ్రా తెలిపారు.
ఇదెలా జరిగింది?
రైల్వే అధికారులు ఈ సంఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు.
స్వయంగా సంబల్పూర్ డివిజన్ డీఆర్ఎమ్ జయదేవ్ గుప్తా ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. స్కిడ్ బ్రేకులు సరిగా ఉపయోగించకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని ఆయన తెలిపారు.
రైల్వేశాఖ ఈ సంఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రధాన ప్రజా సంబంధాల అధికారి జ్యోతి ప్రకాశ్ మిశ్రా తెలిపారు.
ఈ సంఘటన అనంతరం విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారనే అభియోగంతో ఇద్దరు డ్రైవర్లు సహా మొత్తం ఏడుగురిని సస్పెండ్ చేశారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)