పిఠాపురం ఏఈ కుటుంబం ఆత్మహత్య: నెలకిందటే ఏఈ నూకరాజు అల్లుడి మృతి, ఈ మరణాలపై షూటింగ్ కోచ్‌ మీద వచ్చిన ఆరోపణలేంటి?

పిఠాపురం పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజినీర్ తిల్లపూడి నూకరాజు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, పిఠాపురం పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజినీర్ తిల్లపూడి నూకరాజు
    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్‌
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

పిఠాపురం పంచాయతీరాజ్ విభాగంలో అసిస్టెంట్ ఇంజినీర్‌గ పని చేసిన తిల్లపూడి నూకరాజు తన ముగ్గురు కుటుంబ సభ్యులతో సహా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో కొత్తకోణాలు వెలుగులోకి వస్తున్నాయి.

రాజమండ్రి రోడ్‌ కమ్ రైల్వే బ్రిడ్జి వద్ద నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య, మనవడు కలిసి ఈనెల 16వ తేదీ రాత్రి ఆత్యహత్యకు యత్నించారు.

పదేళ్ల వయసున్న నూకరాజు మనవడిని సమీపంలోని మత్స్యకారులు రక్షించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.

నూకరాజు మృతదేహం తర్వాత లభ్యం కాగా మిగతా ఇద్దరి ఆచూకీ ఇంకా దొరకలేదని ఈ కేసు దర్యాప్తు చేస్తున్న రాజమండ్రి టూటౌన్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్ గణేశ్‌ తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

‘కొవ్వూరులో టిఫిన్ చేసి రాజమండ్రి వైపు... ’

ఈ కేసు పూర్వాపరాలను రాజమండ్రి టూటౌన్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్ గణేశ్‌ బీబీసీకి వెల్లడించారు.

‘‘ఈ ఆదివారం (ఆగస్టు 16) రాత్రి 11:30 గంటల సమయంలో నూకరాజు కుటుంబం గోదావరి వద్ద ఆత్మహత్యకు ప్రయత్నించింది. కారు బ్రిడ్జిపై పార్కింగ్‌ చేసి కుటుంబ సభ్యులు నలుగురు ఒకేసారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో కారులో వచ్చిన నూకరాజు కుటుంబసభ్యులు కొవ్వూరులో టిఫిన్‌ చేసిన తర్వాత రాజమండ్రి వైపుకి వచ్చారు. 80వ హోల్‌ దగ్గర కారు ఆపి బయటకు వచ్చి ముందుగా నూకరాజు అతని భార్య.. తర్వాత సౌజన్య, ఆమె కుమారుడు ఆత్మహత్యకు యత్నించారు.

అయితే బాలుడికి ఈత రావడం, సమీపంలో ఉన్న మత్స్యకారులు రక్షించడంతో అతనొక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు'' అని సీఐ గణేశ్‌ వివరించారు.

(ఆత్మహత్య ఆలోచనలు కలిగితే దాన్నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వానికి చెందిన జీవన్ సాథీ హెల్ప్ లైన్ 18002333330కి ఫోన్ చేయండి.

సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ కూడా 18005990019 హెల్ప్ లైన్‌ను 13 భాషల్లో నిర్వహిస్తోంది.

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ హెల్ప్ లైన్ నంబర్ 08026995000)

లభ్యమైన సూసైడ్‌ లెటర్‌

పిఠాపురం పంచాయతీరాజ్‌ అధికారుల వాట్సాప్‌ గ్రూపులో నూకరాజు పోస్ట్‌ చేసిన ఓ లెటర్‌ వెలుగులోకి వచ్చిందని సీఐ గణేశ్‌ తెలిపారు.

''నూకరాజు రాత్రి 11.30 సమయంలో ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది. అయితే దీనికి ముందు 11.27 నిమిషాలకు ఆయన రాసిన సూసైడ్‌ లెటర్‌ను తన తోటి అధికారులు ఉన్న వాట్సాప్‌ గ్రూపులో పోస్ట్‌ చేశారు. కాకినాడ జిల్లా కలెక్టర్‌కు విన్నవిస్తూ రాసిన ఆ లేఖలో.. కాకినాడ షూటింగ్‌ స్పోర్ట్‌ అకాడమీ ఫౌండర్, కోచ్‌ సాదిక్‌ ఖాన్‌ వేధింపుల కారణంగానే తమ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు నూకరాజు పేర్కొన్నారు. ఈ ఏడాది జులై 2న తన అల్లుడు మరణించినప్పటి నుంచి తన కుమార్తెను సాదిక్‌ ఖాన్‌ వేధిస్తున్నాడని, అతని కారణంగా తన కుమార్తెకు, మనవడుకు ప్రాణహాని ఉందనే మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఏఈ నూకరాజు లెటర్‌లో పేర్కొన్నారు'' అని సీఐ గణేశ్ వెల్లడించారు.

''రైఫిల్‌ షూటింగ్‌లో నా మనవడికి శిక్షణ ఇస్తూ, కుమార్తెకు సహాయంగా ఉంటానని షేక్‌ షాదీ ఖాన్‌ నమ్మించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సంబంధించిన డబ్బులు, విలువైన వస్తువులు, బ్యాంకు ఖాతాలను తన ఆధీనంలోకి తీసుకున్నాడు'' అని ఆ లేఖలో పేర్కొన్నట్టు సీఐ వివరించారు. సాదిక్‌ ఖాన్‌ కారణంగానే తమ కుటుంబం తీవ్ర ఇబ్బందులకు గురైందని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూసైడ్‌ నోట్‌లో నూకరాజు కోరారని చెప్పారు.

నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని బీబీసీకి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కిశోర్ వెల్లడించారు. గోదావరి నదిలో గాలింపులో మత్స్యకారుల సాయం తీసుకుంటున్నామని ఎస్పీ వివరించారు.

నిందితుడు సాదిక్ ఖాన్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, ఆరోపణలు ఎదుర్కొంటున్న సాదిక్ ఖాన్

పరారీలో సాదిక్‌..

ప్రస్తుతం సాదిక్ పరారీలో ఉన్నారని కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌ బీబీసీకి తెలిపారు.

కాగా, ఈ ఏడాది డిసెంబర్‌లో నూకరాజు రిటైర్‌ కానున్నారని ఇంతలోనే ఈ విషాదఘటన జరిగిందని బీబీసీతో కాకినాడ జిల్లా పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ శ్రీనివాస్‌ చెప్పారు. మరోవైపు పంచాయతీరాజ్‌ ఏఈ కుటుంబం ఆత్మహత్యాయత్నం ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు.

గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. అవసరమైతే ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాల సేవలను వినియోగించాలని సూచించారు.

ఈ మేరకు తూర్పు, కాకినాడ జిల్లాల ఎస్పీలతో పవన్‌ కల్యాణ్ మాట్లాడారని, ఆత్మహత్యాయత్నానికి దారి తీసిన పరిస్థితులపై ఆరా తీశారని, బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది.

సౌజన్య భర్త మరణంలోనూ సాదిక్ హస్తముందంటూ ఓ ఫిర్యాదు..

నూకరాజు కుమార్తె సౌజన్య భర్త జగదీశ్వర్‌రెడ్డి ఈ ఏడాది జులై2వ తేదీన మరణించారు.

జగదీశ్వర్ రెడ్డి కూడా సాదిక్‌ వేధింపులతోనే చనిపోయారంటూ తాజాగా సౌజన్య రాసిన లేఖ దొరికిందని సౌజన్య మామ భాస్కర్ రెడ్డి ఈనెల 18న (మంగళవారం) సర్పవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమారుడు జగదీశ్వర్‌రెడ్డి మరణంలోనూ సాధిక్ హస్తం ఉందని అనుమానంగా ఉన్నట్లు బీబీసీతో భాస్కర్ రెడ్డి చెప్పారు.

'నా కుమారుడు చనిపోయినప్పుడు అది సహజ మరణమే అనుకున్నాం. కానీ ఇప్పుడు నా కోడలు, మనవడు, వియ్యంకుడు, తన భార్యతో సహా ఆత్మహత్యకు ప్రయత్నించారు. అదృష్టవశాత్తు నా మనవడు ప్రాణాలతో బయటపడ్డాడు. నా కోడలి బండిలో మూడు కవర్లు ఉన్నాయని నా మనవడు మాకు చెప్పాడు. పోలీసులు సమక్షంలో ఆ కవర్లను తెరచి చూశాం. నా కుమారుడు జగదీశ్వర్‌ రెడ్డికి ఏదో మందు ఇచ్చి సాదిక్ చంపినట్లు సౌజన్య రాసిన లెటర్ అందులో ఉంది. అలాగే ప్రైవేట్ విషయాలను అడ్డుపెట్టుకొని నా కోడలిని సాదిక్ బ్లాక్ మెయిల్ చేసినట్లు ఆ లెటర్‌లో ఉంది. అతనికి సహకరించకపోతే నూకరాజు కుటుంబం మొత్తాన్ని చంపుతానని బెదిరించినట్లు ఆ లేఖలో రాసి ఉంది'' అని బీబీసీకి భాస్కర రెడ్డి తెలిపారు.

లెటర్‌లో పేర్కొన్న విషయాలను బట్టి, తన కుమారుడి మరణంపై అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు భాస్కర్ రెడ్డి చెప్పారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టామని, సాదిక్‌ పరారీలో ఉన్నాడని, త్వరలోనే అతన్ని పట్టుకుంటామని బీబీసీకి సర్పవరం సీఐ ప్రకాశ్ తెలిపారు.

షూటింగ్ స్పోర్ట్ అకాడమీ

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, షూటింగ్ స్పోర్ట్ అకాడమీ

'సౌజన్యపై ఒత్తిడి'

తన కోడలు సౌజన్యను ముస్లిం మత ఆచారాలు పాటించాలని, ఇస్లాం బుక్ చదివి ఇస్లాంలోకి మారాలని సాదిక్ ఒత్తిడి చేసేవాడంటూ సర్పవరం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు.

అయితే ఈ వాదనలపై పోలీసులు బహిరంగంగా మాట్లాడటం లేదు. అన్ని విషయాలు పరిశీలిస్తున్నామని సమగ్ర విచారణ తర్వాతే ఏదైనా మాట్లాడగలమని సీఐ ప్రకాశ్ బీబీసీతో అన్నారు.

ఎవరీ సాదిక్ ఖాన్

కాకినాడ కేంద్రంగా 'కాకినాడ షూటింగ్ స్పోర్ట్స్ అకాడమీ' నిర్వహిస్తుంటారు. రైఫిల్ షూటింగ్‌లో శిక్షణ ఇస్తుంటారు. సౌజన్య కుమారుడు గత కొంతకాలంగా సాదిక్ వద్ద రైఫిల్ షూటింగ్‌లో శిక్షణ పొందతున్నాడు.

ప్రస్తుతం సాదిక్ పరారీలో ఉన్నాడని ఇంతకు మించిన వివరాలు లేవని కాకినాడ ఎస్పీ బిందు మాధవ్, సర్పవరం సీఐ ప్రకాశ్‌లు బీబీసీకి తెలిపారు. అయితే సాధిక్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో ఉన్నాయి. వాటిల్లో ఆయన ప్రముఖులతో దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి.

సాదిక్ తన సోదరి, తల్లితో కలిసి కాకినాడలో ఉంటున్నారు. అయితే ఆయన కుటుంబాన్ని కలిసేందుకు బీబీసీ ప్రయత్నించింది. కానీ, వారు అందుబాటులోకి రాలేదు. సాదిక్ మొబైల్‌కు ఫోన్ చేయగా ఆయన నుంచి స్పందన రాలేదు. సాదిక్, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు స్పందిస్తే ఈ కథనంలో అప్‌డేట్ చేస్తాం.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)